Vidadala Rajani : హెల్త్ యూనివర్సిటీకీ ఎన్టీయార్ పేరు తీసేసి డాక్టర్ వైఎస్సార్ అని పేరు పెట్టడంతో మొదలైన వివాదం ఇంకా కంటిన్యు అవుతునే ఉంది. వైఎస్సార్ పేరు పెట్టిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై చంద్రబాబునాయుడుతో పాటు తమ్ముళ్ళలో కొందరు పెద్దఎత్తున విరుచుకుపడుతున్నారు. ఈ నేపధ్యంలోనే నందమూరి బాలకృష్ణ ఒక ట్వీట్లో చాలా ఘాటు వ్యాఖ్యలు చేశారు. దానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజనీ గట్టిగా సమాధానమిచ్చారు.
ప్రజల ఆరోగ్యం అంటే మీకు అంత చులకనా అంటు బాలయ్యపై రజనీ మండిపడ్డారు. 104, 108 వాహనాలను పాడుపెట్టి, ఆరోగ్యశ్రీ పథకాన్ని చంపేసి హెల్త్ యూనివర్సిటీకి మాత్రం తండ్రి ఎన్టీయార్ పేరు ఉండాలని ఉద్యమాలు చేస్తారా అంటు మంత్రి రెచ్చిపోయారు. ప్రభుత్వాసుపత్రుల్లో పిల్లలన్ని ఎలుకలు కొరికేయటం, సెల్ ఫోన్ వెలుగులో ఆపరేషన్లు చేసేస్ధాయికి ప్రభుత్వాసుపత్రులను దిగజార్చేశారంటు బాలయ్యపై మంత్రి రెచ్చిపోయారు.
మంత్రి వ్యాఖ్యలపై బాలయ్య ఏమీ స్పందించకపోయినా టీడీపీ మహిళాధ్యక్షురాలు వంగలపూడి అనిత గట్టిగా కౌంటర్లిచ్చారు. గవర్నమెంటు ఆసుపత్రులను సెల్ ఫోన్ లైట్లతో ఆపరేషన్లు చేసేస్ధాయికి దిగజార్చింది నీలిగ్యాంగే అయినా మెడికల్ యూనివర్సిటీకి వైఎస్సార్ పేరే ఉండాలని అనుకుంటోందంటు ఎద్దేవాచేశారు. దోచుకున్న భూమి, దోచుకున్న సొమ్ములో కొంత ఖర్చుపెట్టి కొత్త ఆసుపత్రి నిర్మించి ప్రజలకు సేవచేసుకోవచ్చుగా అంటు సలహా ఇచ్చారు. ఆ ఆసుపత్రికి వైఎస్సార్ పేరుపెడితే ఎవరైనా వద్దంటారా అంటు నిలదీశారు. హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీయార్ పేరు తీసేయటం అనైతికం, అసంబద్ధం అంటు నిప్పులు చెరిగారు.
వైఎస్సార్ పేరు నిలబెట్టడం అంటే కనబడిన ప్రతిబోర్డుకు పేరురాసి గుంజపాతి నిలబెట్టడం కాదని ఎద్దేవాచేశారు. ఈ విషయాన్ని మీ పుత్రరత్నానికి అర్ధరాత్రి మంతనాలలో మీరైనా చెప్పండి వైఎస్సార్ గారు అంటు అనిత సెటైర్లు వేశారు. మొత్తానికి పేరుమార్పు రాజకీయం రాష్ట్రంలో చాలా జోరుగా సాగుతోంది. ఇలాంటి రాజకీయం ఎక్కడ ఆగుతుందో మాత్రం తెలీటంలేదు. దీనివల్ల మామూలు జనాలకు ఏమి ఉపయోగమో కూడా అర్ధం కావటంలేదు.