IAS SriLakshmi : మైనింగ్ లీజులు కేటాయించాలంటే రు. 80 లక్షలు సమర్పించుకోవాల్సిందేనా ? కేసు విచారణ సందర్భంగా అవుననే అంటోంది సీబీఐ. ఉమ్మడి రాష్ట్రంలో మైనింగ్ లీజులు ఇవ్వాలంటే మైనింగ్ దరఖాస్తును పరిశీలించేందుకే అప్పటి గనుల శాఖ ఉన్నతాధికారిగా ఉన్న శ్రీలక్ష్మి రు. 80 లక్షలు అడిగినట్లు సీబీఐ కోర్టులో చెప్పింది. శ్రీలక్ష్మితో పాటు గనులశాఖ డైరెక్టరుగా ఉన్న వీడీ రాజగోపాల్ కూడా అవినీతికి పాల్పడినట్లు దర్యాప్తు సంస్ధ తన వాదన వినిపించింది.
తమ దరఖాస్తులను పరిశీలించేందుకే శ్రీలక్ష్మి తదితరులు పెద్దఎత్తున డబ్బులు డిమాండ్ చేశారని అప్పట్లో గాలి జనార్ధనరెడ్డికి పోటీగా మైనింగ్ లీజుకు దరఖాస్తు చేసుకున్న పోటీదారులు చెప్పినట్లు సీబీఐ కోర్టులో చెప్పింది. అప్పట్లో గనులశాఖ మంత్రిగా పనిచేసిన సబితా ఇంద్రారెడ్డి, గాలి జనార్ధనరెడ్డి పీఏ మెఫజ్ ఆలీఖాన్ దాఖలు చేసిన డిస్చార్జి పిటీషన్లను సీబీఐ కోర్టు ప్రధాన న్యాయమూర్తి రమేష్ బాబు విచారించారు.
ఈ సందర్భంగానే సీబీఐ లాయర్ తన వాదనలు వినిపిస్తు శ్రీలక్ష్మీ, రాజగోపాల్, మరో ఐఏఎస్ అధికారి కృపానందం తదితరులు గాలి జనార్ధనరెడ్డితో కుమ్మక్కయినట్లు ఆరోపించారు. లీజుకోసం పోటీదారులు ఎవరొచ్చినా లక్షల రూపాయలు ఖర్చులు పెట్టుకోగలరా ? అంటు శ్రీలక్ష్మి అడిగేవారని లాయర్ చెప్పారు. గాలికి లీజులు దక్కటంలో ఐఏఎస్ అధికారులతో పాటు డైరెక్టర్ కూడా బాగా సహకారం అందించారని లాయర్ ఆరోపించారు.
గాలి అక్రమ మైనింగ్ కు వీరు సహకరించిన కారణంగా ఆయన సింగపూర్, చైనా లాంటి దేశాలకు యధేచ్చగా అక్రమ మైనింగ్ ను తరలించినట్లు కొందరు సాక్ష్యులు వాగ్మూలం ఇచ్చినట్లు లాయర్ చెప్పారు. కృపానందం ఇప్పటికే రిటైర్ అయిపోయారు కాబట్టి ఆయన్ను ప్రాసిక్యూట్ చేయటానికి ఎలాంటి అనుమతులు తీసుకోవాల్సిన అవసరం కూడా లేదని సీబీఐ లాయర్ స్పష్టంచేశారు. అప్పట్లో సంచలనం సృష్టించిన గాలి జనార్ధనరెడ్డి అక్రమ మైనింగ్ కేసు విచారణ ఏళ్ళ తరబడి ఇలా సాగుతునే ఉంది. విచారణను జాప్యం చేసేందుకే నిందితులు ఇలా డిస్చార్జి పిటీషన్లు వేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.