janasena: ఈ కార్టూన్ దేనికి సంకేతం ?

janasena: జనసేన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పేరుతో ఒక కార్టూన్ అచ్చయ్యింది. స్కూళ్ళని ప్రభుత్వం విలీనం చేయటం, కొందరు పిల్లలకు బళ్ళు దూరమవ్వటం నేపధ్యంలో ఆ కార్టూన్ ప్రచురితమైంది. సరే కార్టూర్ అచ్చయ్యింది జనసేన ట్విట్టర్ ఖాతాలోనే కాబట్టి దాన్ని జనసైనికులే బాగా సర్క్యులేట్ చేస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పవన్ ఆరోపణలు, విమర్శలు, కార్టూన్లను జనసైనికులు పాపులర్ చేయటంలో వింతేమీలేదు.

అయితే ఈ కార్టూన్ ద్వారా పవన్ మిత్రపక్షానికి ఏమి చెప్పదలచుకున్నారన్నదే అర్ధం కావటంలేదు. కార్టూన్లో గమనించాల్సిన విషయాలు రెండున్నాయి. మొదటిదేమో ఇద్దరు పిల్లలకు భుజానికి బ్యాగులు తగిలించుకుని స్కూలుకి వెళుతుండటం. ఆ ఇద్దరిలో అబ్బాయేమో నిక్కర్, చొక్కా వేసుకున్నాడు. వేసుకున్న చొక్కాకు వైసీపీ జెండా రంగుల్లోని నీలం కలర్ కనబడుతోంది. అలాగే పక్కనే ఉన్న అమ్మాయి కూడా డ్రస్ వేసుకున్నది.

ఆ అమ్మాయి వేసుకున్న డ్రస్ లో టాప్ ఏమో బీజేపీ రంగైన కాషాయం, రెడ్ కలర్లు కనబడుతున్నాయి. అలాగే బాటమ్ గౌన్ కలరేమో గ్రీన్ కలర్లో కనబడుతోంది. అంటే ఇది బీజేపీ జెండా కలర్ అన్న విషయం అందరికీ తెలిసిందే. కార్టూర్ ద్వారా అబ్బాయి చొక్కాకేమో వైసీపీ రంగుల్లోని ఒకటి వేసి, అమ్మాయికేమో బీజేపీ జెండాలోని రంగులేయటం ద్వారా పవన్ ఏమి చెప్పదలచుకున్నారు ? వైసీపీ-బీజేపీ రెండుపార్టీలు ఒకటవుతున్నాయన్నది పవన్ ఉద్దేశ్యమా ?

ఇదే విషయాన్ని పవన్ పార్టీతో పాటు మిగిలిన జనాలకు కూడా చెప్పదలచుకున్నారా ? మరి కార్టూన్ ద్వారా పవన్ చెప్పదలచుకున్నది ఇదే అయితే కమలంపార్టీతో జనసేనకు ఉన్న బంధం ఏమవుతుంది ? తమ రెండుపార్టీలు మిత్రపక్షాలే అని వచ్చే ఎన్నికలకు కలిసే వెళతామని ఒకవైపు బీజేపీ, జనసేన నేతలు పదే పదే చెబుతున్నారు. అయితే నేతలు చెప్పుకుంటున్న సఖ్యత పార్టీల మధ్య లేవన్నది వాస్తవం. పార్టీ నేతల మాటల్లో ఒకటి చేతల్లో మరోటి కనబడుతోంది.

రెండుపార్టీల నేతలు కూడా ఎప్పుడెప్పుడు విడిపోదామా అని చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నట్లే అనుమానంగా ఉంది. కాకపోతే తెగతెంపుల ప్రకటన ముందుగా ఏ పార్టీనుండి వస్తుందనే విషయంలోనే ఆలస్యమవుతోంది. ఎందుకంటే ముందుగా ఎవరైతే పొత్తునుండి బయటకు వెళ్ళిపోతున్నట్లు ప్రకటిస్తారో ఆ రెండోపార్టీకి పొత్తును తెంపుకున్న పార్టీపై బురదచల్లటానికి అవకాశం దొరుకుతుంది. మీఅంతట మీరే పొత్తు వద్దని బయటకు వెళ్ళిపోయారని దెప్పిపొడవటానికి బాగా ఉపయోగపడుతుంది.

ఈ ఒక్క కారణం కోసమే రెండుపార్టీలు ఎదురుచూస్తున్నట్లున్నాయి. మొన్న భీమవరంలో జరిగిన అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భం కూడా ఇందులో భాగమే. నరేంద్రమోడి హాజరైన కార్యక్రమానికి పవన్ను చివరి నిముషంలో మాత్రమే కేంద్రప్రభుత్వం ఆహ్వానించింది. మరి ముందడుగు ఎవరేస్తారు ? దాన్ని ఎవరు అడ్వాంటేజ్ గా తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది. ఈలోపు ఇలాంటి కార్టూన్లు ఇంకా ఎన్నొస్తాయో చూడాలి.