Vijaya Milk.. సామాన్యుల పరిస్థితి రోజురోజుకు అగమ్య గోచరంగా మారుతోంది.. ఒకవైపు పప్పులు, ఉప్పు , నూనె ధరలతో పాటు పెట్రోల్ , డీజిల్, గ్యాస్ ధరలు ఆకాశాన్ని అంటుతుంటే ఇప్పుడు పాల ధరలు కూడా పెరిగిపోతున్నాయి. విజయ పాల ధరలు లీటరుకు రెండు రూపాయలు చొప్పున పెంచుతున్నట్లు కృష్ణ మిల్క్ యూనియన్ (విజయ డెయిరీ) నిర్ణయం తీసుకుంది. రైతుల పాల సేకరణ ధరలు ,నిర్వహణ, రవాణా ఖర్చులు కూడా పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూనియన్ మేనేజింగ్ డైరెక్టర్ కొల్లి ఈశ్వర బాబు తెలిపారు.
విజయ లోఫాట్ లీటర్ పాల ధర 52 రూపాయలు ఉండగా.. దానిని రూ.54 కు పెంచారు. విజయ ఎకానమీ లీటర్ రూ. 56 ఉండగా.. రూ. 58కి, విజయ ప్రీమియం లీటర్ రూ.60 ఉండగా .. రూ.62 కు, విజయ స్పెషల్ పాలు లీటర్ ధర 70 రూపాయల నుంచి రూ. 72 కు , విజయ టీ లీటర్ పాలు రూ. 66 నుంచిరూ. 68 కి పెంచినట్లు సమాచారం. అయితే ఈ పెరిగిన ధరలు మార్చి ఒకటవ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి.. ఇకపోతే పాల కార్డు నెల వారీ కొన్నవారికి మార్చ్ 9వ తేదీ వరకు పాత ధరలే వర్తిస్తాయని స్పష్టం చేశారు. ఇక చిన్న పాల ప్యాకెట్లు, పెరుగు, పాల పదార్థాల ధరలలో ఎటువంటి మార్పు లేదని కూడా స్పష్టం చేశారు..