History Facts: చరిత్ర నిజాలు : అంబేద్కర్ కి గాంధీ కి అభిప్రాయ బేధాలు వచ్చిన విషయం ఇదే!!

History Factsఆరాధ్య దైవంగా:
బడుగు బలహీన వర్గాల ఆత్మబంధువు డా||బి.ఆర్. అంబేద్కర్ అనడం లో సందేహమే లేదు. వారి జీవితాలలో వెలుగులు నింపడానికి ఆయన పడ్డ కష్టం అలాంటిది.తరతరాలనుండి సమాజంలో సమాన స్థానం పొందలేక సమాజపరం గా అనేక అవమానాలకు గురి అవుతున్న వర్గాల అభివృద్ధికి ఆయన జీవితం మొత్తం కృషి చేసి అణగారి పోతున్న జాతికి విలువైన జీవితాన్ని అందిచి అంబేద్కర్ వారి ఆరాధ్య దైవంగా స్థానం సంపాదించుకున్నారు.

History Facts రాజ్యాంగ బద్ధంగా పోరాటం:

హిందూ వర్ణాశ్రమ వ్యవస్థ ను తీవ్రం గా వ్యతిరేకించారు అంబేద్కర్. శూద్రులను, అస్పృశ్యులను అణగద్రొక్కడానికి ప్రయత్నించిన హిందూ కుల వ్యవస్థ విధానాన్ని చాలా నిశితంగా విమర్శించి, అస్పృశ్యతని నివారించడానికి రాజ్యాంగ బద్ధంగా పోరాటం చేసారు. జాతీయ నాయకుడు అంబేద్కర్ సమకాలీన రాజకీయలలో ఎన్నో విమర్శలు ఎదురుకున్న, ఆధునిక భారత ప్రజా స్వామ్యం ఆయనను అఖండ దేశభక్తునిగా, సామాజిక విప్లవ కర్తగా గుర్తించింది.

జననం :

సమాజం లో ఉండే అస్పృశ్యతకు గురైన అంబేద్కర్ మధ్యప్రదేశ్‌లోని మౌ అనే గ్రామంలో కీ.శ. 1891 ఏప్రిల్ 14న రాంజీ , భీమాబాయ్ దంపతుల కు 14వ సంతానం గా పుట్టారు. ఆయన తండ్రి రామ్ జీ మీలోజీనంపాల్ షెడ్యూల్డు కులమైన మహర్ కులానికి చెందినవ్యక్తి. మహర్‌లు మంచి యోధులుగా, ధీరులుగా చరిత్రలో చాలా ప్రసిద్ధి చెందారు. ఈ నాటికి మన సైన్యంలో మహర్ రెజిమెంట్ అనే పేరుతో ఒక సైనిక విభాగం కూడా ఉంది.
చిన్నతనం లో ఎదురైన అవధుల్ని, అవరోధాలను, అన్యాయాలను ఎదురించి నిలబడి ఒక సంపూర్ణ వ్యక్తిగా అంబేద్కర్ రూపుదిద్దుకున్నారు. భారత రాజకీయ, ఆర్థిక, సాంఘిక వ్యవస్థలో ఉన్న అసమానతలను మట్టుబెట్టి , భారతీయ సమా జాన్ని మహోన్నత సమాజం గా తీర్చిదిద్దాలని ఆయన కోరుకున్నారు.

అంబేద్కర్ రచనలు:

అంబేద్కర్ రచనలు శాస్త్రవేత్తల మన్నన లు పొందడం తో పాటు కొత్త ఆలోచన లను కూడా పుట్టించాయి. బ్రిటీషు పాలనలో కేంద్ర శాసనసభ సమావేశాల్లో పాల్గొన్న సభ్యులకు అంబేద్కర్ ఆలోచనా సరళి రచనలు పరిశీలనా గ్రంథంగా ఉపయోగపడ్డాయి. మారుతున్న పరిస్థితుల కారణం గా సామా జిక, ఆర్థిక, రాజకీయ విషయా లలో అంబేద్కర్ అభిప్రాయాలు సరయినవి గా తోచాయి. బలహీన వర్గాల్లో చైతన్యం రగిలించి వారికి నాయకత్వం వహించి అంబేద్కర్ తన రాజకీయ మహా ప్రస్థానానికి శ్రీకారం చుట్టారు అనే చెప్పాలి. బొంబాయి రాష్ట్ర శాసనసభ సభ్యత్వం తో పాటు రాజనీతి శాస్త్రంలో విశేష పరిజ్ఞానం ఆయన కృషికి ఎంతగానో సహాయపడ్డాయి. అంబేద్కర్ ఏ రంగంలో కృషి చేసినా రచనా వ్యాసంగాన్ని మాత్రం వదల్లేదు. ఆయన రచనలు, చేసిన ప్రసంగాలు అంబేద్కర్ జ్ఞానసంపద కు మణిహారాలు గా చెప్పబడ్డాయి. 16 సవత్సరాలకే పెద్దలు ఆయనకు పెళ్ళి చేశారు.

అంబేద్కర్ విద్యాభ్యాసం :

ఇక విద్యాభ్యాసం గురించి తెలుసుకోవాలంటే, బరోడా మహారాజు శాయాజీరావ్ గైక్వాడ్ ఇచ్చిన 25 రూపాయల విద్యార్థి వేతనంతో 1912లో బి.ఏ. పరీక్షల్లోపాసయ్యారు. ఆ వెంటనే బరోడా సంస్థానంలోఉడ్జ్యోగం అయితే వచ్చింది కాని పైచదువుల మీద ఉన్న కోరికతో ప ఉద్యోగంలో చేరలేదు. మహారాజుకు తన మనస్సులోని కోరికను తెలిపాడు. విదేశంలో చదువు ముగుసినతర్వాత బరోడా సంస్థానంలో పదేళ్ళ పాటు పని చేయాలి అనే షరతుపై 1913లో రాజాగారి ఆర్థిక సహాయం పొంది కొలంబియా విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు. 1915 సంవత్సరం లో ఎం.ఏ., 1916 సంవత్సరం లో పి.హెచ్.డి. పట్టాలను పొందారు. డాక్టర్ అంబేద్కర్‍గా 1917లో స్వదేశానికి తిరిగి వచ్చారు. అప్పటికి అతని వయస్సు 27 సంవత్సరాలు. ఒక దళితుడు అంత గొప్ప పేరు పొందడం ఆనాటి అగ్రవర్ణాలవారిని ఆశ్చర్యానికి గురి చేసింది.

సైనిక కార్యదర్శి:

మహారాజా శాయాజీరావ్ సంస్థానంలో సైనిక కార్యదర్శి గా చేరారు. కొల్హాపూర్ మహారాజు సాహూ మహరాజ్ అస్పృశ్యతా నివారణ కోసం ఎంతగానో కృషి చేసారు. మహారాజా సహాయంతో అంబేద్కర్ మూక నాయక్ అనే పక్షపత్రికకు సంపాదకత్వంచేసారు. సాహు మహారాజు ఆర్థిక సహాయం చేసి అంబేద్కర్‌ని పైచదువుల కోసం విదేశాలకు పంపించారు. 32 సంవత్సరాల వయస్సున్న డా.అంబేద్కర్, బార్-అట్-లా, కొలంబియా విశ్వవిద్యాలయం నుండి పి.హెచ్.డి., లండన్ విశ్వవిద్యాలయం నుండి డి.ఎస్.సి పట్టాలను సాధించారు. ఎన్ని సాధించిన ఎన్ని చదివిన అస్పృశ్యత మాత్రం ఆయన్ని వెంటాడుతూనే ఉండేది.

అంబేద్కర్ నాయకత్వం:

1927లో మహాద్‍లో దళిత జాతుల మహాసభ ను నిర్వహించారు. ఆ సభకు మహారాష్ట్ర గుజరాత్‍ల నుండి కొన్ని వేలమందిపాల్గొన్నారు. మహాద్ చెరువులోని నీటిని తాగడానికి అంటరానివారికి ఆ చెరువు దగ్గరకు ప్రవేశం లేకపోయినది. కానీ అంబేద్కర్ నాయకత్వంలో వేలాదిమంది ఆ చెరువు నీరుతాగగలిగారు. ఈ సంఘటన మహారాష్ట్రంలో సంచలనం గా మారింది. అంబేద్కర్ 1927లో బహిష్కృత భారతి అనే మరాఠి పక్ష పత్రిక ను మొదలు పెట్టారు. ఆ పత్రికలో ఒక వ్యాసం వ్రాస్తూ అంబేద్కర్ ఈ విధం గా అన్నారు. తిలక్ అంటరానివాడుగ పుట్టివుంటే స్వరాజ్యం నా జన్మ హక్కు అనే బదులుగా అస్పృశ్యతా నివారణే నా ధ్యేయం, నా జన్మ హక్కు అనిచాటి ఉండేవారు అని రాసారు. ఈ మాటలను బట్టే ఆనాడు అంబేద్కర్ కులతత్వవాదులు పెట్టిన బాధలను ఎంతగా అనుభవించి ఉంటారో తెలుస్తుంది.

1927లో ఛత్రపతి శివాజీ త్రిశతి జయంతి ఉత్సవాలుమహారాష్ట్ర అంతటా ఘనంగా జరిగాయి. అక్కడకు అంబేద్కర్‌ను సాదరంగా ఆహ్వానించాడు కొలాబాలోని ఉత్సవ సంఘాధ్యక్షుడు బ్రాహ్మణుడైన బాలాయ శాస్త్రి. ఆ ఉత్సవాలలో ప్రసంగం చేస్తూ అంబేద్కర్ పీష్వాల సామ్రాజ్య పతనానికి ముఖ్యకారణం అస్పృశ్యతను పాటించడమే అని అన్నారు.

అంబేద్కర్‌కు కాంగ్రెస్ నుండి అందని మద్దతు:

భారత జాతీయ కాంగ్రెస్ నడిపే జాతీయోద్యములో అంటరానితన నిర్మూలన కోసం గాంధీ కృషి చేస్తూ ఉంటే, ఆ కృషికి తగ్గట్టుగా కాంగ్రెస్ సభ్యులనుండి పూర్తి స్థాయిలో మద్దతు అందలేదు అనే చెప్పాలి. గాంధి వర్ణ వ్యవస్థను భారత సమాజపు ప్రత్యేక లక్షణమని, ఎవరి కుల వృత్తిని వారు చేసుకోవడం వల్ల ఎటువంటి పోటీలేని ఆర్థిక వ్యవస్థ భారతసమాజములో ఉంటుంది అని ఆయన దమర్ధించడం జరిగింది. అయితే అంటరానివారుగా చూడబడుతున్న కులాల వారు తమ ఆత్మగౌరవమును త్యాగం చేస్తూ సమాజ బాగు కోసం ఆ వృత్తులను చేస్తున్నారని, అటువంటి వారిని ఇతర వర్ణముల వారందరూ గౌరవించాలని తెలియచేసారు.

గాంధీ తో అంబేద్కర్‌కు విభేదాలు:

కుల, అంటరానితన సమస్యకు గాంధీ సామాజిక, సాంస్కృతిక పరిష్కారమును చూపినప్పుడు అంబేద్కర్ ఈ విషయములో గాంధీతో విభేదించారు. అంటరాని కులాలవారు ఆర్థికముగా బలపడనిదే, రాజకీయాధికారము పొందనంతవరకు వారి సమస్యకు పూర్తి పరిష్కారము దొరకదని అంబేద్కర్ గట్టిగా భావించారు. 1919 మాంటేగ్ చేమ్స్ ఫర్డ్ సంస్కరణలు భారతదేశములో ఎలా పనిచేస్తున్నాయో అధ్యయనం చేయడానికి, నూతన రాజ్యంగ సంస్కరణలు సూచించేందుకు ఏర్పాటు చేసిన సైమన్ కమిషన్ 1928 లో భారత దేశం లో పర్యటించింది. ఆ పర్యటన అనంతరం ఆ కమిటీ బ్రిటిష్ ప్రభుత్వానికి అందించిన నివేదికను చర్చించడానికి బ్రిటిష్ ప్రభుత్వం మూడు సమావేశాలను ఏర్పాటు చేసింది. ఈ సమావేశాలు వరుసగా 1930, 1931,1932 లలో జరిగాయి. ఈ మూడు సమావేశాలకు అంబేద్కర్ హాజరు అవ్వగా రెండవ సమావేశములో భారత జాతీయ కాంగ్రెస్ తరపున గాంధీ హాజరు కావడం జరిగింది. గాంధీకి అంబేద్కర్‌కు మధ్య ఈ సమావేశాములోనే భేదాభిప్రాయాలు వచ్చాయి. దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలు ఇవ్వాలని అంబేద్కర్ పట్టుబట్టగా, అలా ఇస్తే హిందూ సమాజం విచ్ఛిన్నమవుతుందన్న కారణం తో దానికి గాంధి అంగీకరించలేదు. అభిప్రాయాలూ కుదరకపోవడముతో రెండవ రౌండ్ టేబుల్ సమావేశము నుండి గాంధీ బయటకు వచ్చేసారు. 1932 లో రామ్సే మెక్ డోనాల్డ్ కమ్యూనల్ అవార్డు ను ప్రకటించారు. దీని ప్రకారం దళితులకు ప్రత్యేక నియోజక వర్గాలు ప్రతిపాదించడం అనేది జరిగింది. ఈ ప్రకటనవచ్చే నాటికి గాంధీ శాసనోల్లంఘన ఉద్యమములో భాగముగా అరెస్ట్ అయి ఎరవాడ జైలులో ఉండడం జరిగింది. ఈ ప్రకటన గురించి తెలుసుకున్న గాంధీ నిరాహారదీక్ష చేయడం తో అంబేద్కర్‌పై నైతిక వత్తిడి పెరగ సాగింది. చివరికి గాంధీకి, అంబేద్కర్‌కు మధ్య పూనా ఒప్పందం కుదిరి కమ్యూనల్ అవార్డ్ కన్నా ఎక్కువ స్థానాలు ఉమ్మడి నియోజక వర్గాలలో ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. దీని తర్వాత గాంధి హరిజన్ సేవక్ సమాజ్ ఏర్పాటు చేసి అస్పృస్యత నివారణకు తనవంతు కృషి చేసారు . అంబేద్కర్‌ను సైతం ఇందులో భాగస్వామిని చేసారు గాంధీ.

చిత్త శుద్ధి లేని నాయకులు:
అంటరానితనం నిర్మూలనలో గాంధీకి ఉన్న చిత్తశుద్ధి మిగతా కాంగ్రెస్ నాయకులకు ఉండేది కాదు. దీనితో అంబేద్కర్, గాంధీ చేస్తున్న ఉద్యమము నుండి బయటకు వచ్చి దళిత సమస్యల పరిష్కారానికి ప్రత్యేకముగా ఆలిండియా డిప్రె స్స్‌డ్ క్లాస్ కాంగ్రెస్, ఆలిండియా షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్ వంటి అనేక రాజకీయ పార్టీలను ఏర్పాటు చేసి దేశవ్యాప్తముగా ఉన్న దళితులను కూడగట్టే ప్రయత్నమూ చేసారు. ఈ సమయం లోనే క్విట్ ఇండియా ఉద్యమం, ఆ తరువాత దేశ విభజనతో కూడిన స్వాతంత్ర్యము రావడం అనేది జరిగింది .

అంబేద్కర్ రాజ్యాంగం రచించటం:

రాజ్యాంగ పరిషత్తు సభ్యుడిగా అంబేద్కర్ ఎంతో శ్రమ కి ఓర్చి రాజ్యాంగం రచించటం ఆయన శేష జీవితంలో ముఖ్యమైన అంశం గా చెప్పబడింది. ‘రాజ్యాంగ రచనా సంఘంలో నియమితులైన ఏడుగురిలో ఒకరు రాజీనామా చేయడం జరిగింది . మరొకరు మృతి చెందారు. వేరొకరు అమెరికాలో ఉండిపోవాలిసి వచ్చింది. ఇంకొకరు రాష్ట్ర రాజకీయాలలో మునిగిపోయారు. ఉన్న ఒక్కరిద్దరు ఏవో కారణాల చేత ఢిల్లీకి దూరంగా ఉండవలిసి వచ్చింది. అందువల్ల భారత రాజ్యాంగ రచనా భారం మొత్తం డా.అంబేద్కర్ మీద పడింది. రాజ్యాంగ రచన అత్యంత ప్రామాణికంగా ఉంటుందనటంలో అయితే ఏలాంటి సందేహం లేదు’ కేంద్ర మంత్రి మండలిలో న్యాయశాఖ మంత్రిగా పని చేసి 1951 అక్టోబరులో మంత్రి పదవికి రాజీనామా చేసారు. అంబేద్కర్ తన 56 ఏట సారస్వత బ్రాహ్మణ కుటుంబానికి చెందిన కుమారి శారదా కబీర్ ను వివాహమాడారు. ఆయన మొదటి భార్య 1935లో మరణించింది.

బౌద్ధ మతం :

1956 లో అక్టోబరు 14న నాగపూర్‌లో అంబేద్కర్ బౌద్ధమతాన్నితీసుకున్నారు. గాంధీతో అనేక విషయాలలో విభేదించినాఆయన మతం మరవలసి వచ్చినప్పుడు మాత్రం దేశానికి చాలా తక్కువ ప్రమాదకరం అయినదానినే తీసుకుంటాను అని , బౌద్ధం భారతీయ సంస్కృతీ లో భాగమని, ఈ దేశ చరిత్ర సంస్కృతులు, తన మార్పిడివల్ల దెబ్బతినకుండా చూసాను అని అన్నారు. హిందువుగా పుట్టిన అంబేద్కర్ హిందువుగా మాత్రం మరణించలేదు. నిరంతర కృషితో సాగిన ఆయన జీవితం ఎన్నో ఉద్యమాలకు ఊపిరి పోసింది. ముఖ్యంగా సాంఘిక సంస్కరణలకు అంబేద్కర్ ఎక్కువ గ్రంథాలురాయడం అనేది జరిగింది. ప్రసిద్ధ రచయిత అయిన బెవెర్లి నికొలస్ డాక్టర్ అంబేద్కర్ భారతదేశం లో ఉన్న ఆరుగురు మేధావులలో ఒకరు అని ప్రశంసించారు . సంఘసంస్కర్తగా,మహామేధావిగా, న్యాయశాస్త్రవేత్తగా, కీర్తి పొందిన డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్ 1956 లో డిసెంబరు 6 న మరణించారు.