pawan kalyan: కావాలనే బీజేపీ అవమానించిందా ?

pawan kalyan:  భీమవరం కేంద్రంగా జరిగిన రాజకీయాలు చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానం పెరిగిపోతోంది. విప్లవవీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా భీమవరంలో కాంస్య విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. ఈ విగ్రహావిష్కరణకు నరేంద్రమోడి హాజరయ్యారు. ప్రధానమంత్రి హాజరయ్యే కార్యక్రమాల్లో ఎవరెవరు పాల్గొనాలి, హెలిప్యాడ్ దగ్గర ఎవరెవరు స్వాగతం పలకాలనే విషయాన్ని ప్రధానమంత్రి కార్యాలయం అధికారులే చూసుకుంటారు. రాష్ట్రప్రభుత్వం కూడా కొన్ని పేర్లను సిఫారసుచేస్తుంది.

అయితే ఆ పేర్లలో దేన్ని పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా పీఎంవో ఇష్టమే. ఇపుడు భీమవరంలో జరిగిన కార్యక్రమాన్ని తీసుకుంటే ఈ కార్యక్రమాన్ని మొదటినుండి పర్యవేక్షిస్తున్నది కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్ రెడ్డే. రాష్ట్రంలో ఎవరెవరికి ఆహ్వానాలు పంపాలనే విషయాన్ని స్వయంగా కిషనే చూసుకున్నారు. మామూలుగా జరిగేదేమిటంటే ఇతర పార్టీల విషయాన్ని పక్కనపెట్టేస్తే మిత్రపక్షం ఉంటే దానికి బాగా ప్రాధాన్యతిస్తారు. ఇక్కడ కిషన్ కూడా అదేపని చేయాల్సిన కిషన్ అలాచేయలేదు.

మిత్రపక్షమైన జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను వదిలేశారు. చివరినిముషంలో ఆహ్వానాన్ని పంపించారు. అదికూడా పవన్ను రమ్మని కాకుండా పార్టీ తరపున ఒక ప్రతినిధిని పంపమని చెప్పారు. పవన్ కు ఆహ్వానాన్ని పంపించి పార్టీ తరపున ఒక ప్రతినిధిని పంపమని చెప్పటమంటే అవమానించినట్లే. పైగా ఇదే సమయంలో పవన్ సోదరుడు, మెగాస్టార్ చిరంజీవిని మాత్రం కార్యక్రమంలో పాల్గొనేందుకు రమ్మని ఆహ్వానించారు. చిరంజీవికి సినీ సెలబ్రిటి అనే హోదా తప్ప రెండోదిలేదు. మరదే సెలబ్రిటీ స్టేటస్ పవన్ కు కూడా ఉన్న విషయాన్ని కిషన్ ఎందుకు పట్టించుకోలేదు.


మిత్రపక్షం అధినేతగా పవన్ కు ఇవ్వాల్సిన కనీస మర్యాద ఇవ్వకపోతే బాగా అవమానం చేసినట్లు అర్ధమైపోతోంది. నిజానికి ఇంతగా అవమానించాల్సిన అవసరమైతే బీజేపీకి లేదు. అయినా అవమానించారంటే అర్ధమేంటి ? ఏమిటంటే ఏదోరోజు పవన్ తమను వదిలేస్తారనే అనుమానాలు బీజేపీ నేతల్లో బలంగా నాటుకుపోయినట్లుంది. పవన్ తాజా వ్యాఖ్యలు ఆమధ్య ఇచ్చిన మూడు ఆప్షన్ల తర్వాత రెండుపార్టీల మధ్య సంబంధాలు బాగా దెబ్బతినేశాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకునే పవన్ను అవమానించటమే కాకుండా చిరంజీవికి బాగా ప్రాధాన్యత ఇచ్చింది.


అంటే వచ్చే ఎన్నికల్లో తమతో కలిసి పవన్ ఎన్నికల్లో పాల్గొనడనే అభిప్రాయానికి కమలంపార్టీ నేతలు వచ్చేసినట్లున్నారు. అందుకనే ఇలా అవమానించారు. పొమ్మనకుండా పొగబెట్టడం అని దీన్నే అంటారు. తనంతట తానుగానే పొత్తును వద్దనుకుని పవన్ వెళిపోయేట్లు చేయటమే కమలనాదుల ఉద్దేశ్యంగా కనబడుతోంది. ఈ మొత్తం ఎపిసోడ్ లో బీజేపీకి వచ్చే లాభమూ లేదు జరిగే నష్టమూ లేదు. ఎందుకంటే బీజేపీ పెట్టుకున్నదే గోచి. ఆ గోచి ఉంటే ఎంత ఊడిపోతే ఎంతన్నట్లుగా ఉంది కమలనాదుల వ్యవహారం. మరి బీజేపీ చేసిన అవమానానినికి పవన్ ఎలా సమాధానం చెబుతారో చూడాల్సిందే.