హిందూ సాంప్రదాయం ప్రకారం సనాతన ధర్మం లో ఎన్నో విషయాలను ప్రతి ఒక్కరూ పాటించాల్సి ఉంటుంది ముఖ్యంగా లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అంటే తప్పకుండా మహాలక్ష్మిని, ధనలక్ష్మిని పూజించాలని పెద్దలు చెబుతూ ఉంటారు. ఇక అష్ట అంటే ఎనిమిది. అష్ట కష్టాలు అంటే ఎనిమిది రకాల కష్టాలను తీర్చే శక్తి కేవలం అష్టలక్ష్మి లకు మాత్రమే ఉంది అని పండితులు చెబుతారు. అయితే ఏ లక్ష్మి ఎలాంటి కష్టం తీరుస్తుందో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.
1. ఆదిలక్ష్మి : వైకుంఠంలో శ్రీమన్నారాయణుడు తో కొలువుదీరి ఉంటుంది ఆదిలక్ష్మి.. ముఖ్యంగా లక్ష్మీదేవి చేతిలో కనిపించే తామర పవిత్రతకు చిహ్నంగా భావిస్తారు. ఇక ఆదిలక్ష్మిని ఇందిరాదేవి అని కూడా పూజిస్తారు. ముఖ్యంగా ఆదిలక్ష్మిని ఆరాధిస్తే సంతోషంగా ఉండడమే కాకుండా కుటుంబ సభ్యుల మధ్య సామరస్యత పెరుగుతుంది.
2. ధాన్యలక్ష్మి : ఇక ధాన్యలక్ష్మి ని పూజించడం వల్ల ఇంట్లో జీవించే వారికి కావలసిన ఆహారానికి ఎటువంటి లోటు ఉండదు. పైగా పంటలు సరిగా పండాలన్నా.. అతివృష్టి అనావృష్టి సమస్యలను తట్టుకోవాలన్నా కూడా ధాన్యలక్ష్మీ అనుగ్రహం తప్పకుండా ఉండాల్సిందే.
3. ధైర్యలక్ష్మి : ఏ చిన్న కష్టం వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కొనే శక్తి మనకు కావాలి అంటే ధైర్యలక్ష్మి ని పూజించాలి. ముఖ్యంగా ధైర్యలక్ష్మిని పూజించడం వల్ల ఎటువంటి సమస్యకి అయినా సరే పరిష్కారం దొరుకుతుంది. విపత్కర పరిస్థితులలో మనోధైర్యాన్ని పొందాలి అంటే ధైర్యలక్ష్మిని పూజించాలి.
4. గజలక్ష్మి : క్షీరసాగర మథనం జరుగుతున్న సమయంలో సముద్రుడి కుమార్తెగా ఉద్భవించిన ఈమె రెండు ఏనుగులు అమ్మ పక్కన నిలబడి జలధారణ చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా లక్ష్మీగణపతి స్వరూపమైన ఈ మాతను పూజించడం వల్ల ఇల్లు, వాహనాలను సొంతం చేసుకోవచ్చు.
5. సంతానలక్ష్మ : సంతానలేమితో బాధపడే మహిళలు సంతాన లక్ష్మి ని పూజించడం వల్ల అష్ట కష్టాలు తొలగిపోయి సంతానం కలుగుతుంది . ముఖ్యంగా సంతాన లక్ష్మిని పూజిస్తే వారి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
6. విజయలక్ష్మి : మీరు చేపట్టే ప్రతి పనిలో విజయం పొందాలి అంటే తప్పకుండా విజయలక్ష్మిని పూజించాలి. ఇక అమ్మవారి అనుగ్రహం ఉంటే ఎటువంటి కష్టాలు అయినా తొలగిపోయి ఆరోగ్యం రెట్టింపవుతుంది.
7. ధనలక్ష్మి : ఇక ఈ ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా ధనలక్ష్మికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఎందుకంటే మనం జీవించాలి అంటే సంపద అనేది చాలా అవసరం. కాబట్టి అమ్మవారి అనుగ్రహం ఉంటే ఆర్థికంగా ఉన్నత స్థాయి లో ఉండవచ్చు అని ధన లక్ష్మి ని పూజిస్తారు.
8. విద్యాలక్ష్మి : ఆధ్యాత్మికం, భౌతికం ఎందులో అయినా సరే ఏ విద్య అయినా మనం పొందాలి అంటే అమ్మవారి అనుగ్రహం ఉండాల్సిందే. అందుకే విద్యాలక్ష్మి దయ పొందడం కోసం విద్యార్థులు ఎంతగానో పరితపిస్తున్నారు.