Nandamuri Fans: టాలీవుడ్ సీనియర్ హీరో బాలకృష్ణ ఇప్పుడు వెండితెరతో పాటు బుల్లితెరపై కూడా తెగ సందడి చేస్తున్న విషయం తెలిసిందే. చివరిగా అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన బాలయ్య ఇప్పుడు గోపించంద్ మలినేనితో తన 107వ సినిమా చేస్తున్నాడు. ఇక మరోవైపు అన్స్టాపబుల్ అనే టాక్ షోకి హొస్ట్గా వ్యవహరిస్తున్నాడు. అయితే మొదటి సీజన్ కి మంచి రెస్పాన్స్ రావడంతో ఇటీవల రెండో సీజన్ కూడా మొదలు పెట్టారు. అయితే తొలి సీజన్తో పోలిస్తే రెండవ సీజన్ కి రెస్పాన్స్ కాస్త తగ్గిందనే చెప్పాలి . ఇప్పటి వరకు నాలుగు ఎపిసోడ్స్ ప్రసారమైతే , మొదటి షోలో చంద్ర బాబు నాయుడు – లోకేష్ , అనంతరం శర్వానంద్ – అడవి శేష్, విశ్వక్ సేన్ – సిద్దు జొన్నలగడ్డ మరియు కిరణ్ కుమార్ రెడ్డి – రాధికా – సురేష్ రెడ్డి ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.
ఇక రచ్చ రచ్చే..
తాజా ఎపిసోడ్ కోసం లెజెండరీ డైరెక్టర్లు కోదండరామిరెడ్డి, కే రాఘవేంద్రరావు, నిర్మాతలు దగ్గుబాటి సురేశ్బాబు, అల్లు అరవింద్ రాబోతున్నారు. ఎపిసోడ్ 5 డిసెంబర్ 2న ప్రీమియర్ కానుందని ఆహా టీం ట్వీట్ చేయగా, ఈ ఎపిసోడ్లో బాలయ్య ఎంత సందడి చేస్తాడా అని ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే రెండో సీజన్కి కాస్త రెస్పాన్స్ తగ్గుతుందన్న క్రమంలో హైప్ పెంచే ప్రయత్నాలు మొదలు పెట్టారు నిర్వాహకులు . ఈ క్రమంలో తాజాగా వినిపిస్తున్న వార్త ఏమిటంటే త్వరలోనే ఈ షో కి ఎన్టీఆర్ – మోక్షజ్ఞ ముఖ్య అతిధులుగా హాజరు కాబోతున్నట్టు సమాచారం.
ఎన్టీఆర్- మోక్షజ్ఞతో బాలయ్య చేసే సందడి ఓ రేంజ్లో ఉండడం ఖాయమని,టీఆర్పీలు బద్దలు అవ్వడం గ్యారెంటీ అని అభిమానులు లెక్కలు వేసుకుంటున్నారు. ఇదే నిజమవ్వాలని ఫ్యాన్స్ తెగ ప్రార్ధనలు కూడా చేస్తున్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో మొదటి నుండి నందమూరి కుటుంబం జూనియర్ ని తొక్కేయాలని చూస్తున్నారనే ఆందోళన ఉంది. ఈ షో ద్వారా అలాంటి ఆరోపణలకు చెక్ పెట్టాలనే ఆలోచనలో బాలయ్య బాబు కూడా ఉన్నట్టు తెలుస్తుంది..నందమూరి కుటుంబం ఎప్పటికి చీలిపోదు..మేమంతా ఒక్కటే అని చెప్పడానికి ఈ ఎపిసోడ్ ని ప్లాన్ చేసారని నందమూరి కాంపౌండ్ నుండి సమాచారం అందుతుంది.