Pawan kalyan : పవన్ డిసైడ్ అయిపోయినట్లేనా ?

Pawan kalyan : జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాజా వ్యాఖ్యలు విన్నతర్వాత అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. వీరమహిళ సభలో పవన్ మాట్లాడుతు భవిష్యత్తులో కులాలు, మతాల ప్రస్తావన లేని రాజకీయాలు రావాలన్నారు. రాజకీయాల్లో కులాల ప్రస్తావన లేని రాజకీయం ఎలా సాధ్యంకాదో మతం రహిత రాజకీయాలను కూడా ఊహించలేము. నిజానికి కులాలు, మతాలు లేని రాజకీయాలు మొదలైతే సంతోషించాల్సిందే. కానీ అది జరిగేపనికాదని అందరికీ తెలిసిందే.

రాజకీయాల్లో కులాల ప్రస్తావన ఒకపుడు అంతర్లీనంగా ఉండేదన్న విషయం అందరికీ తెలిసిందే. కాకపోతే గడచిన పదేళ్ళుగా మరీ ఎక్కువైపోయి ఇపుడు తారాస్ధాయికి చేరుకుంది. రాజకీయాల్లో కులాల కంపుకు ఈ పార్టీ లేకపోతే ఆ పార్టీయే కారణమని ప్రత్యేకంగా చెప్పేందుకు లేదు. అన్నీపార్టీలు కలిపే ఈ దరిద్రాన్ని జనాలనెత్తిన రుద్దుతున్నాయి. ఇక మత ప్రస్తావనకు కచ్చితంగా బీజేపీయే కారణమని చెప్పటంలో సందేహంలేదు. అప్పుడెప్పుడో రాజజన్మభూమి అని, రథయాత్రని, బాబ్రీమశీదు కూల్చివేతని బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీతో మొదలైన చిచ్చు ఇపుడు బాగా పెరిగిపోయింది.

అధికారంలోకి రావాలంటే మతం ఒక్కటే అడ్డదారన్న విషయం గ్రహించిన బీజేపీ ఆ దారిలోనే నడిచింది. మతాన్ని అడ్డుపెట్టుకుని బీజేపీ మొదలుపెట్టిన దరిద్రం కారణంగా దేశరాజకీయాల్లో మతం, మతంతోరాజకీయాలు బాగా పెరిగిపోయాయి. ఇపుడు బీజేపీ అంటేనే మతతత్వపార్టీ అన్న విషయం చిన్నపిల్లాడిని అడిగినా చెప్పేస్తాడు. ఇలాంటి పార్టీతో పొత్తు పెట్టుకున్న పవన్ కుల, మత రహిత రాజకీయాలు రావాలని కోరుకోవటమే ఆశ్చర్యంగా ఉంది. బీజేపీ మతతత్వపార్టీ అన్న విషయం బాగా తెలిసే పవన్ పొత్తు పెట్టుకున్నారు. పొత్తు పెట్టుకున్న ఇంతకాలానికి మత రహిత రాజకీయాలు రావాలన్న కోరికను ఎందుకు బయటపెట్టారు.

అంటే బీజేపీతో దూరం జరగాలన్న ఆలోచన వచ్చిన తర్వాతే పవన్ వైఖరిలో మార్పొచ్చిందనే విషయం అర్ధమవుతోంది. నిజానికి బీజేపీ వల్ల జనసేనకు ఏమాత్రం ఉపయోగం లేదన్న విషయం అందరికీ తెలిసిందే. లాభంలేకపోగా బీజేపీతో పొత్తు పవన్ కు బాగా నష్టం చేస్తుంది. ఇంతకాలం బీజేపీని ఎలాగో మోసారు కానీ ఇక మోయాల్సిన అవసరంలేదని డిసైడ్ అయినట్లున్నారు. ఒకవైపేమో నరేంద్రమోడి సర్కార్ ఏపీ ప్రయోజనాలను తుంగలో తొక్కేస్తున్నారు.

ఇదే సమయంలో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేస్తామని కతలు చెబుతున్నారు. కమలనాదుల వైఖరిని చూసిన తర్వాతే పవన్ ఆలోచనల్లో మార్పు వచ్చినట్లుంది. భీమవరంలో మోడి పాల్గొంటున్న కార్యక్రమానికి మిత్రపక్షమే అయినా పవన్ కు ప్రత్యేకంగా ఆహ్వానం అందలేదు. పవన్ను ఆహ్వానంచకపోగా సోదరుడు చిరంజీవిని ఆహ్వానించటంతో పవన్ కు బాగా మండుంటుంది. అందుకనే ఇక లాభంలేదని మత ప్రస్తావన లేని రాజకీయాలంటు అందుకున్నారు. ఇదే పాయింట్ మీద ఏదోరోజు రెండుపార్టీలు విడిపోవటం ఖాయం. కాకపోతే ఆ రోజుప్పుడనేదే వెయిట్ చేసి చూడాలి.