ys jagan : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులకు ఝులక్ ఇచ్చారు. అసలేం జరిగిందంటే..శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్తో సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పీఆర్సీ చిక్కుముడిని విప్పేశారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు 23.29శాతాన్ని ఇస్తున్నట్లుగా ప్రకటించారు. పదవీ విరమణ వయసు 60 నుంచి 62 ఏళ్లుకు పెంచుతూ ఉద్యోగులకు ఊహించని వరం ఇచ్చారు.
కానీ, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులను మాత్రం జగన్ తీవ్రంగా నిరాశ పరిచారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు జూన్ 30లోపు ప్రొబేషనరీ కన్ఫర్మేషన్ ప్రక్రియ పూర్తి అవుతుందని.. సవరించిన విధంగా రెగ్యులర్ జీతాలను ఈ ఏడాది జులై జీతం నుంచి ఇస్తామని సీఎం పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రొబేషన్ డిక్లేర్ చేయనందుకు గానూ సచివాలయ ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
రెండేళ్లకు ప్రొబేషన్ ఖరారు చేస్తామని చెప్పి.. ఇప్పుడు వాయిదా వేశారంటూ వాళ్లు మండిపడుతున్నారు. అలాగే జిల్లా జాయింట్ కలెక్టర్, జిల్లా పంచాయతీ అధికారి అడ్మిన్గా ఉండే గ్రూపుల్లో నుంచి ఉద్యోగులు లెఫ్ట్ అయిపోయి పలు చోటు నిరసనకు దిగుతున్నారు. రెండేళ్లు పూర్తైనా తమకు ఎందుకు ప్రొబేషన్ ఖరారు చేయడం లేదంటూ ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. దీంతో ఇప్పుడు ఈ విషయం హాట్ టాపిక్గా మారింది. మరి దీనిపై సీఎం జగన్ ఎలా స్పందిస్తారో చూడాలి.