Chandrababu : మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గత మూడు రోజుల నుంచీ ఆయన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. చంద్రబాబుకు కుప్పం ఓ కంచుకోట. అక్కడ ప్రచారం చేయకపోయినా సులభంగా ఆయన గెలవచ్చు అనే టాక్ ఉండేది. కానీ, ప్రస్తుతం అక్కడ పరిస్థితి అంత మారిపోయింది.
దీంతో ముందే జాగ్రత్త పడుతున్న చంద్రబాబు.. కుప్పం ప్రజలను తనవైపుకు తిప్పుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ విస్తృతంగా పర్యటిస్తూ.. వివిధ స్థాయిల్లోని కేడర్తో సమావేశమై పార్టీ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అలాగే రోడ్ షోలు నిర్వహిస్తూ.. ప్రజలకు చేరువ అయ్యేలా ప్రసంగిస్తున్నారు.
ఈ సందర్భంగా అసెంబ్లీ ఎన్నికల్లో తన పోటీ స్థానంపై నేడు ఆయన ఓ కీలక ప్రకటన చేశారు. చంద్రబాబు మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల ఓటమితో కుప్పాన్ని ఖాళీ చేయాలంటూ వైసీపీ వాళ్లు అవమాన పరుస్తున్నారు. నేను ఎక్కడికీ వెళ్లేది లేదు. జీవితాంతం ఇక్కడినుంచే పోటీ చేస్తా. అరాచకాన్ని తొలగించడంలో ఇక్కడి నుంచే ప్రక్షాళన ప్రారంభిస్తా. మళ్లీ ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో అడుగు పెట్టి, కుప్పాన్ని తిరిగి ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా అంటూ చెప్పుకొచ్చారు. మొత్తానికి వచ్చే ఎన్నికల్లోనే కాకుండా ఎప్పటికీ తన శాశ్వత బరి కుప్పమే అంటూ చంద్రబాబు స్థానికులకు భరోసా ఇచ్చేశారు.