Queen Elizabeth-2: బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్2 96 సంవత్సరాల వయస్సులో గతవారం కన్నుమూశారు. ఆమె మరణం తర్వాత అంత్యక్రియలు ఎక్కడ జరపాలని చర్చలు జరగగా, చివరకు క్వీన్కు ఇష్టమైన ప్రాంతాల్లో ఒకటి విండ్సర్ కాజిల్లోని సెయింట్ జార్జ్ చాపెల్ లో ఆమెను ఖననం చేయబోతున్నారు. గతంలో అనేక మంది రాజ కుటుంబీకుల అంత్యక్రియలు ఇక్కడే నిర్వహించారు. ఈ అంత్యక్రియల కోసం ప్రపంచ దేశాల అధినేతలు హాజరు కాబోతున్న నేపథ్యంలో భారీ భద్రత కోసం దాదాపు 9 మిలియన్ డాలర్లని బ్రిటన్ ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. అంటే మన దేశ కరెన్సీ ప్రకారం 71 కోట్ల రూపాయలు అన్నమాట. ఇక అంత్యక్రియల కోసం సుమారు 125 థియేటర్స్లలో లైవ్ ప్రసారం చేయబోతున్నారు.
Queen Elizabeth-2 : భారీ ఖర్చుతో..
బ్రిటన్ రాణి రాజసానికి గుర్తుగా శవపేటికపై 2,868 వజ్రాలు, 17 నీలమణులు, 11 మరకతమణులు, 269 ముత్యాలు, నాలుగు రూబీలు పొదిగిన కిరీటాన్ని ఉంచారు. ఇక ప్రపంచ స్థాయి నేతలు హాజరవుతుండడంతో బ్రిటన్ ప్రభుత్వం 5,949 మంది పోలీసులను భద్రతా విధుల్లో నియమించింది. వెస్ట్ మినిస్టర్ అబే నుంచి వెల్లింగ్టన్ ద్వారం వరకు సాగే రాణి అంతిమయాత్రలో 1,650 మంది సైనికులు పాల్గొంటున్నారు. రాణి పార్థివ దేహాన్ని చూసేందుకు భారీగా ప్రజలు వస్తున్న నేపథ్యంలో లండన్ లోని 36 కిలోమీటర్ల మేర బారికేడ్లను ఏర్పాటు చేశారు. పార్లమెంట్ హౌస్, వెస్ట్ మినిస్టర్ అబే, బకింగ్ హమ్ ప్యాలెస్ పరిసరాల్లో వీటిని ఏర్పాటు చేశారు.
రాణి అంత్యక్రియల కోసం 10లక్షల మంది ప్రజలు హాజరు అవుతారని అంచనా వేస్తుండగా, వారికి సౌకర్యంగా 500 బస్సులు, 250 రైళ్లు ప్రభుత్వం అదనంగా నడుపుతుంది. ఎటువంటి తొక్కిసలాట జరగకుండా ఉండేందుకు పోలీసులు అడుగడుగునా బారికెడ్లు ఏర్పాటు చేశారు. సెయింట్ జార్జ్ చాపెల్తో రాజకుటుంబానికి సుదీర్ఘ చరిత్రను కలిగి ఉంది. ఇది కేవలం శ్మశానవాటికగా మాత్రమే కాకుండా వివాహాలు, నామకరణాలు, అంత్యక్రియలకు సంబంధించిన ప్రదేశం. చాపెల్ నిర్మాణం మొదట 1475లో కింగ్ ఎడ్వర్డ్ -4 పాలనలో ప్రారంభమైంది. కింగ్ హెన్రీ-8 ఆధ్వర్యంలో 1528లో పూర్తయింది.