సూపర్ స్టార్ అనిపించుకున్న మహేష్ బాబు… ఆసియాలోనే అత్యంత పెద్ద థియేటర్ ను కొన్న వైనం?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అత్యంత విజయవంతమైన, విలాసవంతమైన నటులలో ఒకరు. ఒక్క సినిమాలు మాత్రమే కాకుండా మంచి వ్యాపారవేత్త కూడా. మహేష్ ఏషియన్ సినిమాస్ సహకారంతో హైదరాబాద్‌లో AMB సినిమాస్‌ను స్టార్ట్ చేసిన సంగతి విదితమే. కాగా నేడు AMB సినిమాస్ అనేది యావత్ తెలుగు రాష్ట్రాలలోని మొట్టమొదటి విలాసవంతమైన థియేటర్ అని చెప్పుకోవచ్చు. అందుకే హైదరాబాద్ వాసులు అందులో సినిమాలు చూడటానికి ఎగబడతారు. అయితే త్వరలో వైజాగ్ మరియు జంట తెలుగు రాష్ట్రాల్లోని ఇతర ప్రదేశాలలో కూడా మల్టీప్లెక్స్‌లను తెరవాలని అనుకుంటున్నారు.

అదంతా ఒకెత్తయితే… ఆసియాలోనే అతిపెద్ద స్క్రీన్ థియేటర్‌గా గుర్తింపు పొందిన సూళ్లూరుపేటలో ‘వి ఎపిక్’ థియేటర్ ని ఇపుడు సూపర్ స్టార్ మహేష్ బాబు సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఆమధ్య ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో 35 కారణంగా సినిమా థియేటర్లపై భారీ ఎఫెక్ట్ చూపడంతో వి ఎపిక్ థియేటర్ కూడా కొన్నాళ్ళు మూసివేయడం జరిగింది. దాంతో ఒక్కసారిగా ఈ థియేటర్ పేరు రాష్ట్రమంతటా మారుమ్రోగిపోయింది. కాగా నేడు మన సూపర్ స్టార్ మహేష్ ఈ సినిమా హాలుని సొంతం చేసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి.

ఈ థియేటర్‌ ఇపుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. 100 అడుగుల వెడల్పు, 54 అడుగుల ఎత్తు గల భారీ స్క్రీన్‌ ఈ థియేటర్ సొంతం. ఇందులో 650 మంది ప్రేక్షకులు ఒకేసారి కూర్చుకునే సామర్థ్యం కలదు. దీనిని భారీ హంగులతో సూళ్లూరుపేటలో ‘వి ఎపిక్’ థియేటర్‌ యాజమాన్యం నిర్మించగా నేడు దానిని మెంటైన్ చేయడం భారంగా మారడంతో సదరు యాజమాన్యం మహేష్ బాబుని కాంటాక్ట్ అయినట్టు సమాచారం. ప్రభాస్ నటించిన ‘సాహో’ సినిమాతో ఈ థియేటర్ ప్రస్థానం మొదలవ్వగా హీరో రామ్‌చరణ్ దీని ప్రారంభోత్సవానికి వచ్చారు.

ఇకపోతే, మహేష్ బాబు ప్రస్తుతం పూజా హెగ్డే నటించిన SSMB28 షూటింగ్‌లో మంచి బిజీగా ఉన్నారు. అతడు’, ‘ఖలేజా’ తర్వాత… దాదాపు 13 ఏళ్ళ విరామం తర్వాత మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబోలో సినిమా రావడం వలన ప్రేక్షకులకు ఎన్నో అంచనాలు వున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.