Janasena : వచ్చేనెల 5వ తేదీ అంటే విజయదశమి నుండి ప్రారంభం అవ్వాల్సిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ బస్సుయాత్ర వాయిదాపడినట్లే. బస్సుయాత్ర కోసం జనసేన నేతలు చాలాకాలంగా కఫ్టపడుతున్నారు. యాత్రకోసం ప్రత్యేకంగా బస్సునే రెడీ చేస్తున్నారు. సినీ సెలబ్రిటీలు ప్రత్యేకంగా వాడుతున్న కారవాన్ పద్దతిలోనే యాత్రకు బస్సును రెడీచేస్తున్నట్లు పార్టీవర్గాలు చెప్పాయి. యాత్ర కోసం రూటుమ్యాపును, డైలీ షెడ్యూల్ ను కూడా రెడీ చేసేశారు. బస్సు కాన్వాయ్ లో ఉండేందుకని కొత్తగా ఏడు నల్లటి స్కార్పియో వాహనాలను కూడా కొన్నారు.
ఇన్ని ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో యాత్ర వాయిదా వేసుకుంటున్న పవన్ చెప్పారట. ఇందుకు రెండు కారణాలను పవన్ చెప్పారట. మొదటిదేమంటే షెడ్యూల్ ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉండటం. అక్టోబర్లో యాత్ర మొదలుపెట్టిన ఆరుమాసాల్లో ముగించేట్లుగా ప్లాన్ చేసుకున్నారు. అయితే షెడ్యూల్ ఎన్నికలకు యాత్ర ముగిసిన తర్వాత ఏడాదికాలం గ్యాప్ ఉంటుంది. ఇపుడు యాత్ర ఎందుకు పెట్టుకున్నారంటే ముందస్తు ఎన్నికలు జరగటం ఖాయమన్న అంచనాతోనే బస్సుయాత్రకు హడావుడి ప్లాన్ చేశారు.
ముందస్తు ఎన్నికలు జరగవని షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని ప్రభుత్వం తరపునుండి స్పష్ట వచ్చింది కాబట్టి ఇపుడు యాత్ర చేయటం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదని పవన్ అనుకున్నారట. ఇక రెండో కారణం ఏమిటంటే ముందుగానే అంగీకరించిన సినిమాల షూటింగులన్నీ పూర్తిచేయాలట. వచ్చే జూన్ వరకు బిజీ షెడ్యూల్ ఉందట. ఇపుడు యాత్రగనుక పెట్టుకుంటే సినిమాల షూటింగులన్నీ డిస్ట్రబ్ అవుతాయి. దాంతో భారీ నష్టం తప్పదు. అందుకనే యాత్రను వాయిదా వేసుకుని సినిమాలన్నింటీనీ పూర్తి చేసేస్తే ఎన్నికల సమయానికి ఫ్రెష్ గా ఉంటుందని పవన్ ఆలోచించారట.
సరే కారణాలు ఎలాగున్నా బస్సుయాత్ర వాయిదాపడిందన్నది అనధికారికంగా జరుగుతున్న ప్రచారం. దీనిపై పవన్ కానీ లేదా రాజకీయ వ్యవహారాల కమిటి ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ కానీ తొందరలోనే స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని పార్టీవర్గాలు చెప్పాయి. గతంలో నిర్ణయించిన ప్రకారమైతే 26 జిల్లాల్లోని వీలైనన్ని నియోజకవర్గాలను టచ్ చేయటమే టార్గెట్ గా పెట్టుకున్నారు. ఇపుడు యాత్ర వాయిదా పడబోతోంది కాబట్టి ఈలోగా ఏదో రూపంలో జనాలను కలిస్తుంటే సరిపోతుందని పవన్ అనుకుంటున్నట్లు సమాచారం.
అంటే బస్సుయాత్ర అని కాకుండా మొన్నటి వరకు ఆత్మహత్యలు చేసుకున్న కౌలురైతుల కుటుంబాలను పరామర్శ పేరుతో ఐదారు జిల్లాలు తిరిగారు. పశ్చమగోదావరి, తూర్పుగోదావరి, అనంతపురం, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో పర్యటించారు. ఇలాంటిదే ఏదో పద్దతిలో జనాలను కలుస్తుంటే సరిపోతుందనే ఆలోచన కూడా పవన్లో ఉందట. యాత్ర వాయిదాపడుతోందే కానీ జనాలను పవన్ కలవటం కాదని తెలిసిపోతోంది. బహుశా దీనికి కూడా ఏదైనా ప్లానింగ్ జరుగుతోందేమో తెలీదు. మరి చేయబోయే ప్రకటనలో పవన్ ఏమి చెబుతారో చూడాలి.