మచిలీపట్నం సభలో మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పేర్ని నాని సంచలన ప్రకటన చేశారు. ఈ క్రమంలో ‘జగన్ తో ఇదే నా చివరి మీటింగ్. ఇకపై ఆయనతో కలిసి సభలో పాల్గొనే అవకాశం లేకపోవచ్చు’ అని మాట్లాడుతూ… సుదీర్ఘ ప్రసంగం చేస్తుండగా వెంటనే స్పీచ్ ముగించాలని MLC రఘురాం ఆయనికి సూచించారు. అయినా కూడా నాని తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. ‘రిటైర్ అయిపోతున్నా’ అని బాహాటంగానే ప్రకటించేసారు. దాంతో ఒక్కసారిగా అందరూ అవాక్కయిన పరిస్థితి. అయితే గత కొన్నాళ్లుగా అయన తన రిటైర్మెంట్ గురించి పలు వ్యాఖ్యలు చేసిన సంగతి విదితమే.
సీఎం వైఎస్ జగన్ బందరు పోర్టు పనులను ప్రారంభించిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్ను ఆకాశానికెత్తేశారు నాని. జగన్ వయస్సులో చిన్నవారు… లేదంటే పాదాభివందనం చేసి ఉండేవాడిని వ్యాఖ్యానించారు. నేను పుట్టిన గడ్డకు ఇంత వైభవం తీసుకుని వస్తున్న ముఖ్యమంత్రికి చేతులు ఎత్తి దండం పెడుతున్నానని అన్నారు. ఇకపోతే తన కొడుకును ఇక్కడి నుంచి బరిలోకి దింపుతారనే విషయంపైన ఇపుడు ఊహాగానాలు మొదలయ్యాయి.