Breaking: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఓం రౌత్ దర్శకత్వంలో రామాయణ ఇతిహాసం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ఆదిపురుష్.. ఈ సినిమా టీజర్ విడుదలవగా ఆ టీజర్ వివాదాలలో చిక్కుకున్న సంగతి తెలిసిందే.. తాజాగా ఆదిపురుష్ సినిమా మరో వివాదంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఆదిపురుష్ చిత్రానికి వ్యతిరేకంగా దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా సెన్సార్ బోర్డ్కు అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ నోటీసులు జారీ చేసింది.
ఆదిపురుష్ సినిమాపై అలహాబాద్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం పిటిషన్ నమోదైంది. కుల్దీప్ తివారీ ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఆదిపురుష్ చిత్ర యూనిట్ సెన్సార్ బోర్డు నుండి సర్టిఫికెట్ పొందకుండానే.. చిత్ర నిర్మాతలు సినిమా ప్రోమోను విడుదల చేశారని.. ఇది నిబంధనలను ఉల్లంఘించడమేనని పిటిషన్ లో పేర్కొన్నారు కుల్దీప్ తివారీ. ఈ పిటిషన్ పై స్పందించాల్సిందిగా సెన్సార్ బోర్డుకు అలహాబాద్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కేసు విచారణను ఫిబ్రవరి 21వ తేదీకి వాయిదా వేసింది బెంచ్. ఈ కేసును ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాజేష్ బిందాల్, జస్టిస్ బిఆర్ సింగ్ లతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ విషయం తెలుసుకున్న ప్రభాస్ ఫ్యాన్స్ ఆదిపురుష్ చిత్రం ఈ జన్మకి రిలీజ్ అవ్వదేమోనని తల పట్టుకుంటున్నారు. ఈ సినిమా మొదలు పెట్టినప్పటి నుంచి ఏదో ఒక వివాదం చుట్టూముడుతూనే ఉంది.