Sarojini Naidu : చరిత్ర నిజాలు : నాయుడమ్మ – ఈ దేశం లోని ప్రతీ మహిళ కీ ఆదర్శం !

Sarojini Naidu :  సరోజినీ నాయుడు బాల్యం :
సరోజినీ నాయుడు ఈమె 1879 వ సంవత్సరం ఫీబ్రవరి 13 న హైద్రాబద్ లో పుట్టారు. తల్లి దండ్రులు శ్రీమతి వరద సుందరి డా. అఘోరనాథ్ చటోపాద్యాయా, అఘోరనాథ్ చటోపాధ్యాయగారు హైద్రాబద్ కళాశాలకి అంటే ఇప్పుడు ఉన్న నిజాం కాలేజీ కి మొట్టమొదటి ప్రధానోపాధ్యాయుడిగా పనిచేయడం జరిగింది. తల్లి వరదాదేవి చక్కనిరచయిత్రి. చిన్నతనం నుంచీ ఆమె బెంగాలీ భాషలో చక్కనిమంచి కావ్యాలు, కథలు రాస్తూండేవారు.
సరోజినీ నాయుడు తండ్రి గారైన అఘోరనాథ్ చటోపాధ్యాయ ఎనిమిది భాషలలో పండితుడు. ఆయన ఎడిన్బరో విశ్వవిద్యాలయంలో డాక్టర్ డిగ్రీని పొందారు.

Sarojini Naidu : తల్లి దండ్రులు విద్యాధికులు:

సరోజినీ నాయుడు తల్లి దండ్రులు విద్యాధికులవటం వలన, ఆమె కు చిన్నతనం నుంచే కార్యదీక్షా, పట్టుదలా, విద్యపై సదభిప్రాయాలు ఏర్పడటం అనేది జరిగింది.
చిన్న నాటి నుండే ఆమెకు ఆంగ్లభాష భాషమీద చాలా మక్కువ ఉండేది. ఆ భాషలో మాట్లాడాలని ఆమె ఎంతగానో ప్రయత్నిస్తూండేది. ఆ పట్టుదలా, తోనే ఇంగ్లీషు ను ఎంతో శ్రద్ధగా నేర్చుకోగలిగింది. సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్ లో చదువుకుంది.ఆమె పదకొండో సంవత్సరం లోకి వచ్చేసరికి ఇంగ్లీష్ లో అనర్గళం గా మాట్లాడి అందరినీ ఆశ్చర్య పరిచింది. ఆ వయసులోనే ఇంగ్లీషులో రచనలు కూడా మొదలు పెట్టింది.

 

Sarojini Naidu : చదువుల సరస్వతి:

సరోజినీ నాయుడు పన్నెండవ ఏట మద్రాసు విశ్వవిద్యాలయం లో మెట్రిక్యులేషన్ పూర్తి చేయగలిగిందంటే చేసింది అంటే ఆమె చురుకుదనం తెలివితేటలూ,చదువుమీద ఆమెకు ఉన్న అంకిత భావం అర్ధం చేసుకోవచ్చు. ఆ ప్రతిభే ఆవిడను భారత దేశ మొదటి మహిళా గవర్నర్ గా నిలబెట్టింది.
సరోజినీ దేవి తన పదమూడవసంవత్సరం లో చాలా పెద్ద రచన చేసింది. దానిపేరు సరోవరరాణి. అది పదమూడు వందల పంక్తులతో ఉన్న ఎంతో అతి చక్కని రచన. తాను చెప్పదలచుకున్న విషయము ఇతరుల మనస్సుకు హత్తుకుని ఆలోచింపజేసే విధంగా చక్కని శైలిలో రచనలు తన చిన్న తనం లోనే ప్రారంభించింది.

నిజాంనవాబు అభిమానం,విదేశాలు :

ఆమెలోని ప్రత్యేకతలు గుర్తించిన నిజాంనవాబు ఆమె యందు గల అభిమానంతో ఆమెను విదేశాలకు పంపాలని నిశ్చయిన్చుకుని ,ఆమె వివిధ శాస్త్రాలలో పరిశోధన చేసేందుకు ప్రోత్సహం గా , ఆమెకు ప్రతి సంవత్సరం నాలుగువేల రెండు వందల రూపాయలు విద్యార్థి వేతనంగా ఇవ్వడానికి కూడా ఏర్పాట్లు కూడా జరిగాయి. నిజాంనవాబు ప్రోత్సాహం , సరోజినికి చదువుమీదనున్న ఆసక్తి గ్రహించిన తల్లిదండ్రులు విదేశాలకు పంపించారు. సరోజినీ లండన్ కింగ్స్ కాలేజీ లోను కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయ అధ్వర్యంలోని గిర్టన్ కళాశాలలోనూ చదువుకుంది. ఈవిడ రాసిన కవితలను చదివి, ఇంగ్లాండ్ లోని ఆంగ్ల భాషా విమర్శకులు ‘ఆర్థర్ సైమన్స్’, ఎడ్వర్ గూస్ లు సైతం ఆమెని అభినందించారు. పాశ్చాత్య విద్వాంసులను అనేక మందిని కలసి వారికి గల పాండిత్యాన్ని అర్ధం చేసుకుంటూ వారితో స్నేహ సంబంధాలు పెంచుకుని వారి సలహాలతో, ఆంగ్లం లో ఎంతో చక్కని గ్రంథాలు రాయగలిగింది.

సరోజినీ నాయుడి రచన :
ఆమె రచించిన కావ్యాలలో కాలవిహంగం, స్వర్గ ద్వారం , విరిగిన రెక్కలు అనేవి చాలా ప్రసిద్ధి పొందినవి. ఆమె ఇంగ్లాండ్ లో నివసిస్తూ రచనలు చేస్తూ, వాటిలో భారతీయ జీవితాలు ప్రతిబింబించేటట్లు చేస్తూ.. మన జాతి ప్రత్యేకతలు అందులో కూర్చి కథా ను నడిపించే విధానం చాలా అద్భుతం గా ఉండేది.

ఆమె వివాహం :

1898 వ సంవత్సరం విదేశాలలో విద్య ముగించుకుని భారతదేశం వచ్చాక, ఆమె శ్రీ ముత్యాల గోవిందరాజుల నాయుడు గారి వివాహం జరిగింది. ముత్యాల గోవిందరాజుల నాయుడు అప్పటి హైద్రాబాద్ ప్రధాన ఔషధా,ఆరోగ్య అధికారి గా ఉన్నారు.కులం మతమూ అనే మూఢవిశ్వాసాలంటే సరోజినీ నాయుడికి చిన్నతనం నుంచే విముఖత ఉండేది. కుల మతాతీత భావాలతో పెరిగే ప్రజానీకం మాత్రమే సమ సమాజ స్థాపన చెయ్యగలరనీ ఆమె దృడం గా నమ్మేది.
ఆమెఆ అభిప్రాయంతోనే శ్రీ ముత్యాల గోవిందరాజులు తన కులము కాకపోయినా భారతీయ మహిళా లోకానికి ఆదర్శము కావాలన్న ఉద్దేశంతో ఆరోజుల్లోనే వర్ణాంతర వివాహం చేసుకోవడం జరిగింది. ప్రముఖ సంఘ సంస్కర్త శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు గారు వీరి వివాహం జరిపించారు. ఆమె చేసిన ఈ పనికి ఎన్నో విమర్శలు ఎదుర్కోవలసి వచ్చినా మానవ జీవిత మనుగడకు మనసూ, మానవత్వం మాత్రమే ముఖ్యం అని అర్థం లేని నమ్మకాలను ప్రోత్సహించి, జాతిని పతనము చేసేది కులము కాదని ఆమె చాటిచెప్పింది. ఆమె , ఆమె భర్త భిన్నమైన ఆచార వ్యవహారాలు మరియు కులాల వారైనా, కూడా మనసున్న మనుషులుగా, సంస్కారవంతులుగా నియమబద్దమైన జీవితంబ్రతికి చూపించారు. స్త్రీ, పురుషులు ఒకరినొకరు అర్థం చేసుకుని సంసారము దిద్దుకోగలిగితే కుల,మతాల గొడవ ఏదీ లేదని సమాజానికి తెలియచెప్పారు.

సంతానం :

శ్రీమతి సరోజినీ నాయుడు గోవిందరాజులు నాయుడు గార్ల కి సంతానం గా ఒక కుమారుడూ, ఇద్దరు కుమార్తెలు కలిగారు. కుమారుడు ముత్యాల జయసూర్య నారాయణ , ప్రముఖ హోమియో పతి వైద్యుడు, స్వాతంత్య్ర సమరయోధుడు,హైద్రాబాద్ కు చెందిన రాజకీయ నాయకుడు. కుమార్తెలలోఒకరు పద్మజా నాయుడు ఈమె బెంగాల్ గవర్నరు గా కూడా పనిచేశారు .వివాహమై పిల్లలు పుట్టినా, సరోజినీ నాయుడు కేవలం తన సంతోషం మరియు తన పిల్లల సుఖం మాత్రమే ఆలోచించలేదు. భారతీయులందరి గురించి కూడా ఆలోచించింది.

గోపాల కృష్ణగోఖలే :

అప్పటి ఆంగ్లేయుల పాలనకు వ్యతిరేకంగా దేశము నాలుగు మూలల నుండి ఎందరో నాయకులు ప్రజల్లో స్వతంత్ర భావాలు రేకెత్తించాలని ఉద్యమాలు చేస్తూన్నారు. బ్రిటిష్ ప్రభుత్వం భారతీయులలో విప్లవ భావాలు తలెత్తడము ఓర్చలేకపోయింది. వారు చెప్పినదానికి గంగిరెద్దుల్లా తలలూపుతూ మన సంపద మొత్తాన్ని వారికి అప్ప చెప్పి, మనము వారి చెప్పు క్రింద జీవిస్తూ వారి ప్రభుత్వానికి నివాళులివ్వాలనేది వారి అభిప్రాయం. అఖిల భారత్ జాతీయ కాంగ్రెస్ సంస్థ ఆ రోజులలో గోపాల కృష్ణగోఖలే నాయకత్వంలో ఉద్యమాలు ముందుకు తీసుకెళ్తోంది. వీరు స్త్రీల అభివృద్ధికి ఎంతో కృషి చేసి 1906లో మహిళలకు విద్య అవసరమని దేశమంతా ఎన్నో మహిళా సమావేశాలు ఏర్పాటు చేసి స్త్రీలలో చైతన్యం తీసుకురావడానికి ఎంతో కృషి చేసారు.

ఆరోజుల్లో కాంగ్రెస్ భావాలు:

స్వాతంత్య్ర సాధనలో తానూ పాల్గొనాలి అని ఆలోచించిన సరోజినీ నాయుడుకాంగ్రెస్ జాతీయ భావాలకు అనుగుణంగా నడుచుకోవడం మొదలు పెట్టారు. 1915 వ సంవత్సరం బొంబాయి లో జరిగిన కాంగ్రెస్ మహాసభలలో, 1916 లో జరిగిన లక్నో కాంగ్రెస్ సభలలో ఆమె పాల్గొన్నారు. ఆరోజుల్లో కాంగ్రెస్ భావాలు చాలా ఆదర్శవంతమైనవి. సరోజినీనాయుడు భారతదేశములో ఉన్న ముఖ్యమైన నగరాల్లో తిరుగుతూ స్వాతంత్ర్యోద్యమ ఉపన్యాసాలిచ్చి, ప్రజలలో భాష విప్లవము వచ్చేందుకు కారణం గా నిలిచింది. మృదువుగానే మాట్లాడుతూ, ఎంత కఠినమైన విషయాలైనా,వినేవారి గుండెలను హత్తుకుని, మరుగునపడి ఉన్న యథార్థ స్థితి అర్థమయ్యే విధంగా ఉండే ఆమె గంభీరమైన ఉపన్యాసాలువినేవారికి , కాలం, శ్రమ తెలిసేవి కావు.
ప్రభుత్వానికి ఎదురు తిరిగి తూటా దెబ్బలకో, చీకటి కొట్లకో బలయ్యే బదులు ఈ బానిస బ్రతుకే నయమనుకుని సర్దుకుపొయ్యే అమాయక ప్రజానీకములో ఆమె ఉపన్యాసాలు దేశభక్తిని నింపి చావుకు భయపడని తెగింపును తేగలిగాయి అనడం లో ఎలాంటి సందేహం లేదు.


సరోజినీ అమృత హృదయం :
ఈ విశ్రాంతి లేని ప్రయాణాలతోనూ, ఉపన్యాసాలతోనూ ఆమె ఆరోగ్యం క్షిణించింది. 1919 సంవత్సరంలో పంజాబ్ లోని జలియన్ వాల బాగ్లో హత్యా కాండ సమయానికి సరోజినీనాయుడు లండన్ లోట్రీట్మెంట్ తీసుకుంటోంది. అప్పటి పంజాబ్ గవర్నరైన డయ్యర్ లక్షలాది ప్రాణాలను తుపాకి గుండ్లకు బలిచేసి దారుణంగా హింసించి, చంపిన విషయం ఆమె లండన్ లో విన్నది. వార్తకు ఆమె గుండె ఆ నీరయిపోయింది. అప్పటికే ఆమె గుండె జబ్బుతో ఉన్నదని అది బాగా ముదిరిపోయినదని చెప్పారు డాక్టర్స్. అయినా కూడా అది ఏమి పట్టించుకోకుండా చనిపోతూ ప్రతి భారతీయుడు వేసిన భయంకరమైన కేకలు ఆమె చెవుల్లో మారుమ్రోగాయి. చనిపోయిన వారి భార్యలు, కుమార్తెలు, కుమారుల గుండెలు పగిలే శోకాలు,వారి నిస్సహాయ ఆర్తనాదాలు గుర్తు చేసుకుని ఆ కరుణామూర్తి కదిలిపోయింది.
తన పరిస్థితి అలా ఉండి కూడా ఆరోగ్యాన్ని ఏ మాత్రం లెక్క చేయక పంజాబ్ గవర్నర్ డయ్యర్ మీద ఆందోళన రేపింది. గాంధీజీకి పంజాబ్ దారుణము గురించి ఉత్తరం వ్రాస్తూ, యావత్ ప్రపంచ భారతీయులకు డయ్యర్ ద్వారా జరిగిన ఘోరాన్ని వినిపించనిదే నిద్రపోననీ, వారి రాక్షస కృత్యాలకు బదులుగా భారతదేశం నుంచి వారిని తరిమి కొట్టి, భారతీయుల స్వేచ్ఛ చూడనిదే, భారత మాత కంటి తడి ఆగదని తన సందేశము ద్వారా తెలియచేసింది.

శాసన ధిక్కారం అమలు:

సరోజిని లండన్ నుంచి బయలుదేరి సముద్ర మార్గం గుండా ప్రయాణించి, భారతదేశములో ఓడ దిగటం తోటే శాసన ధిక్కారం అమలుచేసింది. స్వాతంత్ర్యోద్యమ చరిత్రల పుస్తకాలను అమ్మకూడదని, బ్రిటిష్ ప్రభుత్వం ఆజ్ఞలు జారీ చేయడం తో దాని ఫలితంగా చాలా పుస్తకాలను అమ్మటం మానేశారు. గాంధీ జీ సలహాపైన ఆ పుస్తకాలన్నింటినీ ప్రతి వీధిలోనూ అమ్మి ప్రభుత్వ శాసన ధిక్కారం చేసేంత సాహసవంతురాలు సరోజినీనాయుడు.

ఆడపులిలా :

భారతదేశం పైనా, భారతీయుల పట్ల ఆమెకున్న ప్రేమ, వాత్సల్యం ఆమె సొంత ఆరోగ్య విషయం కూడా మరచిపొయ్యే విధంగా చేశాయంటే ఆమె దేశభక్తిని, త్యాగనిరతి ఎంత గొప్పదో మనం అర్ధం చేసుకోవచ్చు.అలాంటి వ్యక్తులు మనకు చాలా అరుదుగా కనిపిస్తుంటారు. ఆ సమయంలోనే ఒక బహిరంగ సభలో ఉపన్యసిస్తూ, బ్రిటిష్ పాలకులు భారతదేశాన్ని తమ సొంతమని భావించడమే అపరాధం. భారతీయుల హక్కులు కాలరాసి, బానిసలుగా చేసి వారి ప్రాణాలుకూడా బలి తీసుకోవటం క్షమించరాని అపరాధం అంటూ ఆడపులిలా గర్జించింది.


సరోజినీ నాయుడును అరెస్టు:
భారతీయ స్త్రీ చేస్తున్న ఉద్యమ ప్రచారనికి బ్రిటిష్ ప్రభుత్వం హడలెత్తిపోయింది. ఆమెను స్వేచ్ఛగా ఉండనీయడం తమ ప్రభుత్వానికిమంచిది కాదు అని భావించి.. సరోజినీ నాయుడును అరెస్టు చేసారు. అరెస్ట్ గురించి గాని జైలు జీవితం అనుభవించడం గురించి గానీ ఆమె ఏ మాత్రంబెంగపడలేదు.

ప్రతి మహిళ కి ఆవిడ ఆదర్శవంతురాలే:

మన దేశ స్వతంత్రం కోసం ఎందరో మహానుభావుల ప్రాణ త్యాగాలు, ఎడతెగని ఉద్యమాల కారణం గా , మన దేశానికి స్వతంత్రం పొందాము. సరోజినీ నాయుడు 75 వ సంవత్సరం లో మార్చ్ 2 1949 లో లక్నౌ లో ప్రశాంతంగా మరణించింది. మన భారత కోకిలగా ప్రఖ్యాతి గాంచిన సరోజినీ నాయుడు స్త్రీల లో చైతన్యానికి, స్వతంత్ర వ్యక్తిత్వానికి ఆదర్శం గా నిలిచారు. ఆవిడమంచి రచయిత్రిమాత్రమే కాదు గొప్ప ఉపన్యాసకురాలు కూడా. ప్రతి మహిళ కి ఆవిడ ఆదర్శవంతురాలే .