ఆదిపురుష్ ట్రైలర్ అదిరిపోయిందంటున్న సూపర్ స్టార్.. సంబరాలు చేసుకుంటున్న రెబల్స్!

భారతీయ ఇతిహాసం ‘రామాయణం’ ఆధారంగా, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, డైరెక్ట‌ర్‌ ఓం రౌత్ తెరకెక్కిస్తోన్న త్రీడీ మోషనల్ క్యాప్చర్ టెక్నాలజీ చిత్రం ‘ఆదిపురుష్’. శ్రీరాముడిగా ప్రభాస్, సీతాదేవిగా కృతి సనన్ నటించగా రావణాశ్వరుడి పాత్రలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ నటించిన ఈ సినిమా జూన్ 16న పాన్ ఇండియా మూవీగా వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతుంది. ఈ తరుణంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ షురూ చేసారు. కాగా, ఈ చిత్రం ట్రైలర్‌ను మంగళవారం అనగా మే 9న రోజున‌ మేకర్స్ విడుదల చేయగా రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది.

ఇంతవరకు ఏ వీడియోకి రాని రెస్పాన్స్ ఆదిపురుష్ ట్రైలర్ కి వస్తుండడం విశేషం. ట్రైలర్ రిలీజ్ అయినప్పటినుండి యూట్యూబ్ లో నెంబర్ వన్ గా దూసుకుపోతోంది. ఈ విషయమై దర్శకుడు ఓం రౌత్ కూడా ట్వీట్ చేయడం జరిగింది. బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వంలో టి సిరీస్ బ్యాన‌ర్‌పై భూష‌ణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్ష‌న్ కార్య‌క్ర‌మాలు శరవేగంగా సాగుతున్నాయి.

నిజానికి ఈ చిత్రాన్ని ఈ ఏడాది సంక్రాంతికే విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ భావించినప్పటికీ వి.ఎఫ్‌.ఎక్స్ ప‌నుల్లో జ‌రిగిన లోపాల కార‌ణంగా 5 నెలలు వాయిదా వేసినట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఆమధ్య విడుదలైన ఆదిపురుష్ టీజర్ ఔట్‌పుట్‌పై సాధార‌ణ ఆడ‌యెన్స్‌తో పాటు ప్ర‌భాస్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ సైతం పెద‌వి విరచడంతో మేక‌ర్స్ వెంట‌నే సినిమాను వాయిదా వేసి లండ‌న్‌కు వెళ్లి మరీ వి.ఎఫ్‌.ఎక్స్ ప‌నుల‌పై ఫోక‌స్ చేసి ఔట్‌పుట్ విష‌యంలో కేర్ తీసుకున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.

అయితే ఆ కష్టం వుట్టిపోలేదు. తాజాగా విడుద‌లైన ఆదిపురుష్ ట్రైల‌ర్ ఆడియెన్స్‌ను విపరీతంగా ఆక‌ట్టుకుంటోంది. ఈ క్రమంలో సాధారణ ప్రేక్షకులతోపాటు సెలిబ్రిటీలు కూడా ట్రైలర్ అదుర్స్ అంటూ తెగ ఆకాశానికెత్తేస్తున్నారు. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం ఆదిపురుష్ ట్రైలర్ అద్భుతం అంటూ తన సోషల్ మీడియా ఖాతాలో రాసుకొచ్చారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ కి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఇకపోతే ఈ సినిమా జూన్ 16న తెలుగు, హిందీ, మ‌ల‌యాళ‌, త‌మిళ‌, క‌న్న‌డ భాష‌ల్లో భారీ ఎత్తున విడుద‌ల కాబోతోంది. ప్రమోషన్లో భాగంగా జూన్ 3న తిరుప‌తిలోని ఎస్‌.వి.గ్రౌండ్స్‌లో ప్రీ రిలీజ్ వేడుక‌లు జరగనుండగా దీనికి ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు.