Nadendla Manohar Vangaveeti Radha: జనసేన పార్టీ కీలక నేత నాదెండ్ల మనోహర్ తాజాగా విజయవాడలో వంగవీటి రాధాకృష్ణతో భేటీ అయ్యారు. వీరిద్దరి భేటీ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. వంగవీటి రాధా కార్యాలయంలో దాదాపు అరగంట పాటు ఏకాంతంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడటం జరిగింది. ఈ పరిణామంతో ఈ నెల నాలుగో తారీఖు వంగవీటి రంగా జయంతి నాడు.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో.. వంగవీటి రాధా జనసేన పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు సోషల్ మీడియాలో ఇప్పుడు ప్రచారం జరుగుతుంది.
ఇందుమూలంగానే ముందుగా.. నాదేండ్ల మనోహర్.. ఆయనతో చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆదివారం నాడు విజయవాడ ఎన్బివికే భవన్ లో జనసేన పార్టీ తరపున “జనవాణి” కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ ఏర్పాట్లను పరిశీలించడానికి వచ్చిన నాదెండ్ల మనోహర్… వంగవీటి రాధాతో భేటీ కావడం ఇప్పుడు సంచలనంగా మారింది. ప్రస్తుతం రాదా టీడీపీలో ఉన్నప్పటికీ పెద్దగా యాక్టివ్ గా లేరు. కానీ ఏదో రూపంలో వార్తల్లో నిలుస్తూ ఉన్నారు. గతంలో తనని హత్య చేయించడానికి రెక్కీ నిర్వహించారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాధా చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో పెను దుమారాన్ని రేపాయి. ఆ టైంలో ప్రభుత్వం భద్రత కల్పించడానికి కూడా ముందుకు వచ్చింది. కానీ రాధా తిరస్కరించారు. అనంతరం చంద్రబాబు నాయుడు.. రాధా ఇంటికి వెళ్లి మరీ పరామర్శించారు. పరిస్థితులు ఇలా ఉంటే నాదెండ్ల మనోహర్ తో వంగవీటి రాధా భేటీ.. ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.