Breaking: రేపు విశాఖకు CM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గురువారం నాడు విశాఖలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రేపు వివిధ అభివృద్ది కార్యక్రమాల ప్రారంభోత్సవాలకు హాజరు కానున్నారు. తాడేపల్లి నివాసం నుంచి రేపు మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరే జగన్ 3 గంటల 20 నిమిషాలకు విశాఖకు చేరుకోనున్నారు. తర్వాత 3.50 గంటలకు పీఎం పాలెం వైఎస్సార్‌ స్టేడియంకు వెళ్లనున్నారు. ఈ స్టేడియంలో ఏర్పాటు చేసిన వైఎస్సార్‌ విగ్రహాన్ని జగన్ ఆవిష్కరిస్తారు.

ఈ విగ్రహావిష్కరణ పూర్తయిన తర్వాత 4.50 గంటలకు ఆరిలోవ అపోలో ఆసుపత్రికి వెళ్లి దానిని కూడా లాంచ్ చేస్తారు. ఈ కార్యక్రమం గురించి ఒక ప్రసంగం కూడా ఇచ్చేలా ప్లాన్ చేశారు. ప్రసంగం ముగిసిన తర్వాత 5.50 గంటలకు బీచ్‌ రోడ్డుకు వెళ్లి.. ఆ ప్రాంతంలో వీఎంఆర్డీఏ డెవలప్ చేసిన సీ హారియర్‌ వార్‌ప్లేన్ మ్యూజియంను ప్రారంభిస్తారు. ఇదే ప్రాంతం నుంచి రామ్‌నగర్‌లోని వీఎంఆర్డీఏ కాంప్లెక్స్, ఎంవీపీలోని ఇండోర్‌ స్పోర్ట్స్‌ ఎరీనాను ప్రారంభించనున్నారు. 6.15 గంటలకు బీచ్‌ రోడ్డులోని ఏయూ కన్వెన్షన్‌ హాల్లో జరగనున్న ఎమ్మెల్యే గొల్ల బాబురావు కుమారుడి వెడ్డింగ్ రిసెప్షన్‌కు కూడా జగన్ అతిథిగా వెళ్తారు. అక్కడినుంచి రాత్రి 7 గంటలకు బయల్దేరి 8.20 సమయానికి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.